Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

గురూజీ జిందాబాద్

గొల్లపూడి మారుతీరావు
                                 gmrsivani@gmail.com
                                     

       

చిన్న రాష్ట్రాల వల్ల మేలు జరగదని మధ్య చాలామంది జుత్తులు పీక్కొంటున్నారు గాని, వారితో మాత్రం నేను ఏకీభవించను. వెంటనే కారణాలు చెప్పమని నన్ను చాలామంది నిలదీస్తారు నాకు తెలుసు.నేను చెప్పను. చక్కగా, కన్నులపండుగగా, నిత్యనూతనంగా ఉన్న ఒకే ఒక రాష్ట్రాన్ని చూపిస్తాను. దాన్ని పరిపాలిస్తూ పదిమంది కీ గురూజీగా చలామణీ అవుతున్న శిబూ శొరేన్ ని చూపిస్తాను.

  రాష్ట్రం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా రాణిస్తోంది. చిన్న రాష్ట్రంగా ఏర్పడినప్పటినుంచీ తొమ్మిది సంవత్సరాలలో ఎనిమిది కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఒక్క సంవత్సరం ఏదో పొరపాటు జరిగిపోయిందని మినహాయిస్తే ప్రతీ సంవత్సరం  రాష్ట్రనాయకులు మొన్నటి ఐపిఎల్ క్రికెట్ ఉత్సవంలాగ ప్రతీ ఏడూ మంత్రి వర్గం గురించి ఊహించుకుంటూ ఆనందిస్తునారు. కొత్త మంత్రులొస్తారు.కొత్త ఉపన్యాసాలిస్తారు. కొత్త ముఖాలు కంపిస్తాయి. ముఖ్యమంత్రులందరూ గిరిజనులు కావడం మరో విశేషం. వీళ్ళందరకీ తలమానికం - మన గురూజీ - ఏలియాస్ శిబూ శొరేన్.

నా జీవితంలో తీరని కోరిక - శిబూ శొరేన్ గారితో ఫోటో తీయించుకోవడం. ఒకప్పుడు పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ప్రపంచంలో కెల్లా గొప్ప అంతర్జాతీయ సంబంధాలను ఏర్పరుచుకున్న నాయకులని చెప్పేవారు. కారణం - ఒక దశలో అటు నాటోకి, సియటోకి, సెంటోకీ (ఉతర, దక్షిణ, మధ్య అట్లాంటిక్ సత్సంబంధాల సంస్థల)తో పొత్తు ఉన్న దేశం ప్రపంచంలో పాకిస్థాన్ ఒక్కటే.
అటు
రష్యాతో, కమ్యూనిస్టు దేశాలతో, ఇటు అమెరికా మిత్రదేశాలతో సత్సంబంధాలను పెట్టుకుని అందరినీ మెప్పించారాయన. అలాంటి మరో మహా నాయకుడు మన గురూజీ ఆయన మన మన్ మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రి... బీజేపీ తో పొత్తు పెట్టుకుని ప్రస్తుతం రాష్ట్ర ముఖ్య మంత్రి ఏదీ? కుష్వంత్ సిన్హాని అవమనండి చూద్దాం. అదొక అద్భుతమైన రాజకీయ శిల్పం. ఆయన కేంద్ర మంత్రి అయారు.ముఖ్యమంత్రి అయారు. కొడుకుని నాయకుడిని చేశారు.హత్యలో సరసమైన ఫాత్ర వహించారు.తను నిరపరాదినని న్యాయస్థ్నాల్ని ఒప్పించారు.మనుషుల్ని మాయంచేశారు.మాయమయిన వాళ్ళు చచ్చిపోయేట్ట్టు చూశారు. ఎంత చిన్న మెజారిటీ వచ్చినా తొణకరు.తనే ముఖ్యమంత్రి కావాలని బల్ల గుద్ది కోరిక చెల్లించుకుంటారు. చిన్న రాష్ట్రం కాకపోతే శిబూ శొరేన్ సేవలు రాష్ట్రానికి దక్కేవా? పెద్ద రాష్ట్రంలో ఆయన పార్టీ ఎక్కడో అడవిలో ఆవకాయలాగ సోదిలోకి లేకుండా పోయేది.

పశ్చిమ బెంగాలులో కమ్యూస్టులు, మావోయిస్టులను రెండు వర్గాల నాయకులు సమర్ధిస్తూ లాల్ గడ్ దొమ్మీని పెద్ద రాద్దాంతం చేశారు. కాని శిబూ బాబుకి గందరగోళం లేదు. ఆయన బేషరతుగా మావోయిస్టుల వెనక నిలిచారు. చరిత్రను సృష్టించిన ఛత్తీస్ గడ్ మారణహోమం గురూజీ ఆశీర్వాద ఫలమేనని పెద్దలు భావిస్తారు.

1975 లోనే జంతారా జిల్లాలో ముస్లిం కుటుంబాల మీద దాడికి నాయకత్వం వహించారు. అందులో తొమ్మిది మంది చచ్చిపోయారు. హత్యానేరం మీద పడింది. 30 ఏళ్ళ తర్వాత నేరం ౠజువైంది. జైలుకెళ్ళారు. బొగ్గు మంత్రి పదవి ఊడింది. అయినా నెలరోజుల్లో న్యాయస్థానాన్ని ఒప్పించి బెయిలు మీద బయటికి వచ్చారు. వచ్చాక కాశీ వెళ్ళి వచ్చిన వాడి పాపాలన్నీ పోయినట్టు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం భావించి మళ్ళీ మంత్రిని చేసింది! తన పర్సనల్ సెక్రటరీ శశికాంత్ ఝాని ఎత్తుకుపోయి చంపించాడన్న కేసు పొక్కగానే మళ్ళీ మాయమయాడు. పిల్లికి తొమ్మిది ప్రాణాలట, గురూజీకి వంద.

2005లో ముఖ్యమంత్రి అయారు. కేవలం తొమ్మిదోజుల తర్వాత అసెంబ్లీలో మెజారిటీ సంపాదించుకోలేక రాజీనామా చేశాడు. ప్రేమించండి, ద్వేషించండి జార్ఖండ్ రాజకీయాలలో శిబూశొరేన్ ని మీరు విస్మరించలేరు. అందుకాయనే గురూజీ.

ఇక తాజా కథ. మధ్యనే బీజేపీతో పొత్తు కలిపి కేవలం నాలుగు నెలల కిందట ఏడవసారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడు పదవి బోరుకొడుతోంది. అందుకని మొన్న పార్లమెంటులో ప్రతిపక్షాలు కట్ మోషన్ పెట్టినప్పుడు అందరూ షాకయేలాగ చిన్న పిలిమొగ్గవేశారు గురూజీ. ఎవరూ ఊహించని రీతిగా కాంగ్రెసనుకూలంగా ఓటు వేశారు. ఎందుకు? శిబూగారు కేంద్రానికి మంత్రిగా వచ్చి రాష్ట్రాన్ని తన కొడుకుకి పట్టం గట్టాలని వారి పన్నాగం. దీనికి మరో గుగ్గురువు కరుణానిధిగారి స్ఫూర్తిఉండవచ్చు. వారి కుటుంబంలో భార్యలు తప్ప అందరూ పదవుల్లో ఉన్నారు. వెనకటికి నాటికలో డైలాగు ఉంది: "అన్ని పాములూ లేచినచో లేడీ పామును లేచి యాడినది" అని. మధ్యలో శిబూ బాబు మద్దతు ఎందుకు? వారికి కావాలని కాదు. తనకు పదవులు కావాలని. ఏమీ సందిగ్ధం లేకుండా "ఛీ అవతలికి పొ"మ్మంది కాంగ్రెసు. మరీ నెత్తి మీదకు వస్తే హంతకుడికీ పదవినిస్తుంది. అవసరం లేకపోతే మహానుభావుడినయినా అవతలికి పొమ్మంటుంది కాంగ్రెసు. గురూజీ ప్రస్థుతం ఉపయోగపడే శాల్తీకాదు.

ఇప్పుడెలాగ? కేవలం 24 గంటలు గడవకుండానే ప్లేటు మార్చేశాడు గురూజీ. బీజేపీ నాయకులకు  బేషరతుగా క్షమాపణ చెప్పి తన తప్పిదానికి నష్టపరిహారంగా ఈసారి బీజేపీ నాయకుడీని సిమ్హాసనం ఎక్కిస్తానన్నాడు. పళ్ళూడినా కళ్ళు లొట్టపోదని  త్రుప్తి.

అయితే బీజేపీ పండి ముదిరిన నాయకులున్న పార్టీ. తీవ్రంగా ఆలోచించి, నెమ్మదిగా స్పందించి - అతని తప్పుని క్షమించి - ఇప్పటికి నువ్వే ముఖ్యమంత్రి   పదవిని వెలగబెట్టమని వదిలేసింది ఎందుకు? ముడ్డికింద ఎసరు ఇంకా బాగా మరగాలి.

ఈలోగా యువరాజు హేమంత్ శొరే కి ఒళ్ళు మండింది. చక్కగా సాగుతున్న సామ్రాజ్యాని కుక్కల పాలు చేసినందుకు. షాజహాన్ ని కొడుకు ఔరంగజేబులాగ తండ్రిని బంధించాడని ఒక కథనం. నక్క కడుపున నక్కపిల్లే పుడుతుంది. తండ్రిలాగ హత్యలు అలవాటు పడడానికి  ఇంకా మెదడు ముదరాలి.

ఏమయినా శిబూశొరేన్ పథకం ఫలించివుంటే ఈసారి జార్ఖండ్ ప్రజలకు అర్ధశతదినోత్సవంలాగ రెండు నెలలకే కొత్త ప్రభుత్వాన్ని చూసే అద్రుష్టం పట్టేది.

కనుక, చిన్న రాష్ట్రాల వల్ల మేలు జరగదని అనే హక్కు ఎవడికుంది? నన్నడిగితే ఇంకా బుల్లి రాష్ట్రాలు చేస్తే నెలవారీ ప్రభుత్వాలను చూసే అవకాశం మనకు దక్కుతుందని నా కల. తొమ్మిది నెలలలో ఎనిమిది ప్రభుత్వాలను ఏర్పరిచిన చిన్న రాష్ట్రంగా జార్ఖండ్ గిన్నిస్ బుక్కులో ఎక్కాలని నా కోరిక. ప్రతీ రాష్ట్రానికి ఒక గురూజీ ఉండాలని నా ఆశ.

         మే 03, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage