అనుసరణ - అనుకరణ  

(పాఠకులకు గమనికః ఈ కాలమ్ ఈ వారం నుంచి ప్రతి గురువారం సాక్షి దినపత్రికలో వస్తుంది. ఆడియో వెర్షన్ తో కలిపి కౌముదిలో అదే రోజు వస్తుంది) 

 

  ఈ రెండు మాటలూ వినడానికి దగ్గరగానే కని పించవచ్చును కాని అర్థం లో ఒకదానికొకటి చాలా దూరం. ఈ రెండు మాట లకీ రామాయణపరంగా అర్థాన్ని వెదుకుదాం.సీతమ్మ వనవాసం లో శ్రీరాముడిని అనుస రించింది. మారీచుడు మాయలేడిగా శ్రీరాముడిని అనుకరించాడు. ఎంత తేడా! మరో గొప్ప ఉదాహరణని చూద్దాం. కన్యాశు ల్కంలో గిరీశం దేనినయినా తన పబ్బంగడుపుకో డానికి అనుకరించగలడు. ఇది పాత్ర. మధురవాణి ఇంట్లో పందిరి పట్టె మంచం కింద కనిపించిన రామ ప్పంతుల్ని పూటకూళ్లమ్మ చీపురు దెబ్బలకి వాడు కున్నాడు. అది ఆ పాత్ర ధోరణి.

ఆ రోజుల్లోనే గొప్ప కవితలు రాసిన ఇంగ్లిషు రచయిత్రి ఒకావిడ ఉన్నారు-ఆన్ టైలర్. ఆమె మొదటి సంకలనాన్ని తన సోదరి జేన్ టైలర్ రచనలతో కలిపి ప్రచురించారు. ఆన్ టైలర్ పేరు చాలా మందికి వెంటనే గుర్తురాదు. కాని పిల్లలకి ఇంగ్లిష్ చదువులు గర్వంగా చెప్పించే తల్లిదండ్రుల దగ్గర్నుం చి, చదువుకొనే పిల్లల వరకూ ఈ పద్యాన్ని ఆనం దంతో కితకితలు పెట్టినట్టు గుర్తుపడతారు.
  
‘‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్

 హౌ ఐ వండర్ వాట్ యూ ఆర్...’’
 ఆన్ టైలర్ రాసిన ‘మై మదర్’ అనే కవితను చూడండి.

Who fed me from her gentle breast  

And hushed me in her arms to rest

And on my cheeks sweet kisses prest

My mother.
దీన్ని ప్రతిభావంతుడూ, మేధావీ అయిన గిరీశం (గురజాడ అందామా?) మక్కీకి మక్కీ 'కన్యాశుల్కం 'లో ఎలా అనుకరించారో చూడండి.

She leaves her bed at AM four

And sweeps the dust from off the Floor

And heaps it all behind the door

The widow.
  
ఇది అచ్చమైన అనుకరణ.

మిత్రులు వెల్చేరు సుబ్రహ్మణ్యంగారిని పలకరించినప్పుడల్లా కొత్త ఆలోచనవేపు చెయ్యిసారిస్తూంటారు.

గురజాడ వారిదే మరో ఉదాహరణ. మన జానపద సాహిత్యంలో దూసుకుసాగే మాత్రాఛ్ఛంద స్సుతో నడిచిన పాటని చూడండి.

గుమ్మాడేడే ముద్దూ గుమ్మా

గుమ్మాడేడే కన్నా తల్లీ

గుమ్మాడేడే గోపీ కృష్టా

గుమ్మాడేడమ్మా.

మొదటి మూడు లైన్లూ 14 మాత్రలు. ఆఖరి లైను 7 మాత్రలు. దాన్ని అపురూపమైన ముత్యాల సరాన్ని చేశారు మహాకవి.

 మెచ్చనంటావీవు

నీవిక మెచ్చకుంటే మించి పోయెను

కొయ్యబొమ్మలు మెచ్చు కళ్లకు

కోమలుల సౌరెక్కునా

కొత్త మాత్రా చందస్సుని తెలుగు సాహిత్యానికి అందించిన ఘనత గురజాడది.

దీనికి అనుసరణ - పుంభావ సరస్వతి, తెలుగు సాహితీ ప్రపంచంలో తన ఉద్దతితో 'దిషణాహంకారం ' తన సొత్తని నిరూపించుకున్న విశ్వనాధ తొలినాటి రచన - 'కోకిలమ్మ పెళ్ళి'. 

చిలుకతల్లి మహాన్వయంబున

నిలిచినవి సాంస్కృతిక వాక్కులు

కోకిలమ్మ తెలుగు పలుకూ

కూడబెట్టిందీ.

 ‘తెలుగు పలుకు కూడబెట్టడం’ ఈ కవిసామ్రా ట్టుకే చెల్లు. ఇది అచ్చమయిన అనుసరణ. మరొక ఆధునిక వైతాళికుడు శ్రీశ్రీ కవితల్లో ఎన్ని డజన్ల కవుల, విదేశీ రచయితల జీనియస్ తొంగిచూసిందో చెప్పడం కష్టం. మయకోవస్కీ, స్విన్‌బర్న్, ఎడ్గార్ ఎలెన్ పో.. ఈ జాబితా అనం తం. శ్రీశ్రీ పాదరసం. నేను రేడియోలో పనిచేసే రోజుల్లో ఒకసారి యాదృచ్ఛికంగా ఆల్బర్ట్ కామూ ‘రైనాసిరస్’ నాటకాన్ని గురించి చెప్పాను. మర్నాటికే - మరొక్కసారి - మర్నాటికే "మట్టిరాక్షసుడు"  అనే కవితని రాసి రేడియో స్టేషన్‌కి తీసుకువచ్చారు. తెలుగు సాహిత్యం మలుపులో కొత్త ఆలోచననీ, కొత్త ఊపిరినీ తెలుగు కవితకి మప్పిన కవి శ్రీశ్రీ.

 ఇక, ఎన్నో చారిత్రక మైన కథలని తన బాణీకి మలుచుకుని అనుసరించిన అద్భుతమైన నాటక రచయిత షేక్స్‌పియర్.

గొప్ప ప్రతిభావంతుడి వెనుక - ఆ ఆలోచనని నమ్మే ఎందరో నడుస్తారు. అనుసరిస్తారు. గొప్ప ప్రతిభ కొన్ని గొప్ప ఆలోచనల్ని తన సొంతం చేసుకుంటుంది. అనుసరణ మూలాన్ని గౌరవిస్తూ, గుర్తిస్తూ, గుర్తుపెడుతూ దాని వెనుక వినయంగా అడుగులు వేయడం. అనుకరణ మూలంలో ప్రక్రియని, విలువల్ని సొంతం చేసుకుని కొత్త రూపాన్ని సంతరించడం. రెండూ రెండు రకాలయిన జీనియస్‌లు.

వాల్మీకి రామాయణాన్ని తమ భాషలో చెప్పి, అనువదించిన మహాకవులెందరో ఉన్నారు. రామాయణాన్ని తన నరాల్లోకి ఎక్కించుకుని, ధమనుల్లో పూరించుకుని తన వేదనతో మేళవించి కొత్తగా ఆవి ష్కరించిన వారూ మరెందలో ఉన్నారు. ఒక్క ఉద హరణ - మళ్లీ విశ్వనాథ.

జాగ్రత్తగా పరిశీలిస్తే-షెల్లీని దేవులపల్లి రచనల్లో గుర్తుపట్టవచ్చు. కాని

’ఎవరని ఈ రేయి నిద ర హృదయమదర

 వేయి చేయి ఛాయలాడ పెనుచీకటి సైగలతో

 నా కన్నుల రక్త మురల లాగి కొందురు...’ అన్నప్పుడు ఒక్క కృష్ణశాస్ర్తే కనిపిస్తాడు.

ఈ కాలాన్ని ఇంతవరకూ రాసి మిత్రులు పేరి రవికుమార్‌గారికి చదివి వినిపించాను. ఆయన మరో రెండు సందర్భాల్ని గుర్తుచేశారు - పూర్వకవులూ ఈ సత్సంప్రదాయంలో భాగస్వాములే - అంటూ.

శ్రీనాధుడు 'శృంగారనైషదం 'లో "ఓ మహికాంసువంశ! కలశోధ కౌస్తుభరథ ..' అని పద్యం మొదలు పెట్టాడు. పెద్దన్నగారు ఆ స్పూర్తితో 'మనుచరిత్ర 'లో సిద్ధుడు ప్రవరాఖ్యునితో అన్న పద్యాన్ని : 'ఓ చతురాస్యవంశ! కలశోధధి పూర్ణ శశాంక..' అని మొదలుపెట్టారు.
  మరో గొప్ప అనుసరణ:

 నన్నయ్య భారతంలో అర్జునుడు ద్రుపదుని బంధించి గురువు ద్రోణా చార్యునికి కానుకగా ఇచ్చినప్పుడు, ఒకప్పుడు తన సహోధ్యాయి, తనని అవమానించిన మహారాజుని చూసి ద్రోణుడు ఎకసెక్కంగా అంటాడుః ‘వీరెవ రయ్య! ద్రుపద మహరాజులె’!! అని.

పోతన పరమ భక్తుడు. సాధువు. భాగవతంలో యశోద! శ్రీకృష్ణుడిని తన అక్కున చేర్చుకుని ముద్దు లాడుతూ ‘‘వీరెవరయ్య! శ్రీకృష్ణుడు కారె!’’ అం టుంది. ఇవి సుప్రసిద్ధమయిన అనుసరణలు. మూలానికి వన్నె తెచ్చేవి కూడా.

ఆలోచన సూర్యరశ్మి లాంటిది.

 ప్రతీ ఉదయం దర్శనమిస్తుంది.

 కాని దానిలో భేదమల్లా ఆ వెలుగు ఆ ఉదయానికే ప్రత్యేకం.

 అంతే.

 

  
                                                                                                               
          

          gmrsivani@gmail.com   
                  అక్టోబర్ 23 ,   2014          

*************

 

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage